అయ్యప్ప భక్తుల వ్యాన్ బోల్తా..8 మంది భక్తులు మృతి

అయ్యప్ప భక్తులు వరుస ప్రమాదాలకు గురి అవుతున్నారు. అయ్యప్ప స్వామి మండల మకర విలక్కు సీజన్ నవంబరు 16 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనం కోసం శబరిమలకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో భక్తులు ప్రయాణిస్తున్న వాహనాలకు పలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. దీంతో పలువురు గాయపడడం..మృతి చెందడం జరుగుతుంది. ఇప్పటికే పలు ప్రమాదాలు జరుగగా..తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకొని ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన థేనీ జిల్లా కుమిలీ పర్వత మార్గంలో చోటుచేసుకుంది.

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా.. వారు ప్రయాణిస్తోన్న వాహనం అదుపుతప్పి 40 అడుగుల లోతైన గోతిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మృతులంతా థేనీ జిల్లా అండిపట్టికి చెందినవారే. కాసేపట్లో స్వస్థలాలకు చేరుకుంటారనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఫై థేనీ జిల్లా కలెక్టర్ కేవీ మురళీధరన్ మాట్లాడుతూ..‘ థేని జిల్లాలోని కుమిలి పర్వత మార్గం వద్ద 40 అడుగుల లోతున్న గొయ్యిలోకి కారు దూసుకెళ్లి ఎనిమిది మంది భక్తులు మరణించారు.. మరికొందరు గాయపడ్డారు’ అని తెలిపారు. అండిపట్టికి చెందిన 10 మంది భక్తులు శబరిమలకు వెళ్లారు. అయ్యప్ప దర్శనం అనంతరం కారులో శుక్రవారం తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం అండిపట్టి సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైందని తెలిపారు.