దేశ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం

రామమందిరం కోసం ఎందరో బలిదానాలు చేశారు

pm modi

అయోధ్య: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడి మాట్లాడుతూ.. ఇదొక చరిత్రాత్మక దినమని చెప్పారు. వందల ఏళ్ల నిరీక్షణ ఈరోజు ముగిసిందని చెప్పారు. దేశ ప్రజలందరి ఆకాంక్షలతో రామ మందిరం నిర్మాణం జరుపుకుంటోందని తెలిపారు. దశాబ్దాల పాటు రామ్ లల్లా ఆలయం టెంట్ లోనే కొనసాగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణం కోసం ఎందరో పోరాటం చేశారని, బలిదానం చేశారని చెప్పారు. వారందరి బలిదానాలతో, త్యాగాలతో రామమందిర నిర్మాణం సాకారమవుతోందని అన్నారు. 130 కోట్ల ప్రజలు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారని తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిగిందని… వారి పోరాటంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని… అదే విధంగా రామాలయం కోసం కూడా పెద్ద పోరాటం జరిగిందని అన్నారు.

రాముడి కార్యక్రమాలన్నింటినీ హనుమంతుడు చూస్తాడని… హనుమంతుడి ఆశీస్సులతోనే ఈరోజు మందిర నిర్మాణం ప్రారంభమైందని మోడి అన్నారు. కోటాను కోట్ల హిందువులకు ఆలయ నిర్మాణం ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. దేశ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయమని అన్నారు. ఇదొక అద్భుతమైన సందర్భమని… నరుడిని నారాయణుడితో కలిపే ఘట్టమని చెప్పారు. ఈరోజు దేశమంతా రామమయం అయిందని అన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయని చెప్పారు.


మందిరం నిర్మాణానికి భూమి పూజ చేయడం మహద్భాగ్యం అని అన్నారు. ఈ మహద్భాగ్యాన్ని రామమందిరం ట్రస్టు అవకాశం కల్పించిందన్నారు. రామమందిరం ఇకపై భవ్య మందిరంగా రూపుదిద్దుకోబోతుందని తెలిపారు. ప్రతి ఒక్కరి మనసు దేదీప్యమానమైంది. దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనలో నిండిపోయిందని చెప్పారు. రామమందిరం నిర్మాణం ఎందరో త్యాగాల ఫలితమిది. రాముడు అందరి మనసులో నిండి ఉన్నారని మోడి పేర్కొన్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/