తణుకు లో జనసేన కార్యకర్తల ఫై దాడి

శుక్రవారం రాత్రి తణుకు లో జనసేన కార్యకర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం తణుకులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత కొద్దీ రోజులుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఇదే క్రమంలో జగన్ సర్కార్ ఫై విమర్శలు , ప్రభుత్వ లోపాలను తెలుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో వైస్సార్సీపీ నేతలు పవన్ కళ్యాణ్ ఫై మాటల యుద్ధం చేస్తున్నారు.

యాత్రలో భాగంగా నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ తణుకు లో భారీ సభ నిర్వహించగా ప్రజలు , జనసేన కార్య కర్తలు , వీరమహిళలు , అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై , సభను సక్సెస్ చేసారు. కాకిలేరు, పాలకొల్లుకు చెందిన కార్యకర్తలు సభ నుండి తిరిగి వెళ్తుండగా..తణుకు శివారు ఇరగవరం కాలనీ సమీపంలో వారిపై కొందరు దుండగులు దాడి చేశారు. కర్రలు, బ్లేడ్లు, ట్యూబ్‌లైట్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో కాకిలేరుకు చెందిన బండారు సతీష్‌, మాదాసు కిరణ్, పాలకొల్లుకు చెందిన వీర మహిళ ప్రియాంక ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ సభకు అపూర్వ స్పందన వచ్చిందన్న అక్కసుతో వైస్సార్సీపీ కార్యకర్తలే తమ వారిపై దాడి చేశారని జనసేన పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు ఆరోపించారు. గాయపడిన వారు తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వీరిని పార్టీ నేత విడివాడ రామచంద్రరావు తదితరులు పరామర్శించారు.