వారు భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
మా పార్టీ శ్రేణులపై పోలీసు స్టేషన్లలో లెక్కలేనన్ని తప్పుడు కేసులు: అచ్చెన్నాయుడు
అమరావతి : టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీ శ్రేణులపై పోలీసు స్టేషన్లలో లెక్కలేనన్ని తప్పుడు కేసులు నమోదు చేశారని, దీంతో ఎఫ్ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపోయాయని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినందుకు టీడీఈ కార్యకర్త అంజిపై కడప జిల్లా చిన్నమండెం పోలీసులు అక్రమ కేసులు పెట్టారని, అంతేగాక, ఆయనను కొట్టారని అచ్చెన్నాయుడు తెలిపారు. కండ్రికలో తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని, అయినప్పటికీ తమ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశారని ఆయన చెప్పారు.
ఇలా తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారుల పేర్లను తాము రాసిపెట్టుకుంటున్నామని, భవిష్యత్లో వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు వ్యవహరిస్తోన్న తీరు పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చిపెడుతోందని చెప్పారు. పోలీసులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, చట్టం ప్రకారం నడుచుకోవాలని ఆయన సూచించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/