అక్రమ కేసులను ఎత్తివేయాలి..అచ్చెన్నాయుడు

వైస్సార్సీపీ పాల్ప‌డ్డ చ‌ర్య‌లు క‌న‌ప‌డ‌ట్లేదా?

అమరావతి: స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ వైస్సార్సీపీ నేత‌లు పాల్ప‌డ్డ చ‌ర్య‌ల‌పై టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు మ‌రోసారి మండిప‌డ్డారు. అమ‌రావ‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… త‌మ పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయకపోతే ఆందోళనకు దిగుతామని చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో వైస్సార్సీపీ నేత‌లు, కార్య‌కర్త‌లు పాల్పడిన చ‌ర్య‌లు పోలీసులకు కనిపించట్లేదా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి, డీజీపీ ఏం చేస్తున్నారని ఆయ‌న నిల‌దీశారు. త‌మ పార్టీ నేత‌లు ఎన్నిక‌ల అధికారుల విధుల‌ను అడ్డుకుంటున్నారంటూ అరెస్టులు చేశార‌ని, అయితే, తమ నేత‌లు అడ్డుకుంది పోలీసుల విధులను కాదని, వైస్సార్సీపీ రిగ్గింగ్ ను అడ్డుకున్నార‌ని చెప్పారు.

వైస్సార్సీపీకి అక్రమ కేసులు పెట్టడం అలవాటు అయిపోయింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఎన్నికలు ముగిశాక కూడా టీడీపీ నేతలపై వైస్సార్సీపీ కక్ష సాధింపులకు దిగుతోందని ఆయ‌న చెప్పారు. కదిరిలో ఎమ్మెల్యే సిద్దారెడ్డి అండ‌తో త‌మ పార్టీ నేత‌ కందికుంట వెంకటప్రసాద్‌పై, అలాగే, గుంటూరు 42వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బుజ్జిపై అక్ర‌మ కేసులు పెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/