ఒకే వేదికపై 11వేల మంది డ్యాన్స్.. గిన్నీస్‌ రికార్డు

అస్సాం గువాహటి నగరం అరుదైన రికార్డ్‌కు వేదికయ్యింది. అస్సాం జానపద నృత్యమైన బిహు డ్యాన్స్‌, డప్పుల మోతలతో సరుసాజాయ్‌ స్టేడియం మారుమోగిపోయింది. ఒకే వేదికపై 11వేల మంది జానపద నృత్య కళాకారులు, డప్పు వాయిద్యకారులు చేసిన ప్రదర్శన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో నమోదయ్యింది.

ఒకే వేదికపై 11,304 మంది కళాకారులు, నృత్యకారులు బిహూ నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. గువాహటిలోని సరుసజై స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంప్రాదాయ వాయిద్యాలైన ధోల్‌, తాల్‌, గోగోనా, టోకా, పెపా వంటివాటిని వాయించే సంగీత కళాకారులు పాల్గొన్నారు. అస్సాం సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఒకే వేదికపై అతిపెద్ద బిహు నృత్య ప్రదర్శనను నిర్వహించడం, జానపద-నృత్యం విభాగంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చేరడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇదే వేదికపై డ్రమ్మర్లు మరో రికార్డును నెలకొల్పారు. బిహు నృత్యం కార్యక్రమం అనంతరం.. అదే స్టేడియంలో 2548 మంది డ్రమ్స్‌ వాయించారు. ఒకే చోట ఇంతపెద్ద సంఖ్యలో డమ్మర్లు ప్రదర్శన ఇచ్చి గిన్నిస్‌ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు.