అమిత్ షా కు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్

గుజరాత్ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న ఎంఐఎం పార్టీ.. బిజెపి పార్టీ ని టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా 2002లో జరిగిన గోద్రా అనంతర అల్లర్లను తెరపైకి తెచ్చారు. 2002లోనే సంఘ విద్రోహశక్తుల్ని అణచివేసి గుజరాత్ దేశానికి ఓ పాఠం నేర్పిందంటూ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడుతున్నాయి. ఇదే క్రమంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు.

గుజరాత్ అల్లర్లను అదుపులోకి తెచ్చామని చెబుతున్న అమిత్ షా.. బాల్కిస్ ను హత్య చేసిన నిందితులను విడుదల చేయాలని పాఠం నేర్పారని ఫైర్ అయ్యారు. నేరస్తులకు శిక్ష పడినప్పుడే అసలైన శాంతి నెలకొంటుందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లో ఉండదని.. ఏదో ఒక రోజు మారుతుందని అన్నారు. ఇక గుజరాత్ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బిజెపికి అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నాలు ఎంఐఎం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై కూడా స్పందించారు. గుజరాత్ లో బిజెపి సుదీర్ఘకాలం అధికారంలో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ చేతగాని తనమేనని వ్యాఖ్యానించారు. ఎంఐఎం ఎవరి ఓట్లు చీల్చడానికి ఇష్టపడడం లేదని.. కేవలం బిజెపికి వ్యతిరేకంగా పోరాడేందుకే మేము ఇక్కడికి వచ్చామన్నారు.