ఏపీలో మున్నూరు కాపులు ఇకపై బీసీలే..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మున్నూరు కాపులను బీసీల కిందకు చేర్చుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీసీ-డీ కింద కుల ధ్రువీకరణ పత్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు హర్షం వ్యక్తం చేశారు.
కాగా, ఇటీవల గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మున్నూరు కాపులు వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. బీసీ-డీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీకి ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణతో పోలిస్తే ఏపీలో మున్నూరు కాపుల సంఖ్య బాగా తక్కువే. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలుగా గుర్తించి… రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనమైన 7 మండలాల్లో మున్నూరు కాపుల సంఖ్య అధికంగా ఉంది. ఇటీవలే సీఎం జగన్ను కలిసిన మున్నూరు కాపులు తమను బీసీలుగా గుర్తించాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు జగన్ ఆదేశాలు ఇవ్వగా… రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.