మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ కు చేదు అనుభవం

,

మునుగోడు ఉప ఎన్నిక బరిలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ కు సొంత నియోజకవర్గం లో చేదు అనుభవం ఎదురైంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచి నియోజకవర్గానికి ఏంచేసావని .. తమ ఊరి మొహం చూడని నువ్వు.. మళ్లీ ఇప్పుడు ఎలా ఓట్లడుగుతావని నిలదీశారు. మొన్న చౌటుప్పల్‌ మడలంలోని అల్లపురంలో ఇలాగే ప్రజలు ఎదురుతిరుగగా..గురువారం మునుగోడు మండలంలోని సోలిపురంలో ప్రచారం చేస్తున్న రాజగోపాల్‌ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు.

తమ ఊరికి ప్రధాన సమస్యగా మారిన బ్రిడ్జిని సొంతఖర్చుతో నిర్మిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని.. ముందు దానిసంగతి చూడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ హామీని నెరవేర్చేవరకు గ్రామంలో ప్రచారం చేయొద్దని అడ్డుకున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ నుంచి మరో విపక్షంలో చేరారని, మరి ఇప్పుడు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేస్తే ఏం ప్రయోజనం ఉండదని, సొంత లాభంకోసమే పార్టీ మారారని పెద్దపెట్టున నినాదాలు తీశారు. ఎంత సర్ది చెప్పిన ప్రజలు వినకపోవడంతో చేసేదేం లేక రాజగోపాల్ అక్కడినుండి వెనుతిరిగారు.