చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ పై తీర్పు రిజర్వ్

శుక్రవారం లిఖిత పూర్వక వాదనలు సమర్పించిన ఇరు పక్షాలు

chandrababu-naidu

అమరావతిః అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, దాన్ని అనుసంధానించే ఇతర రోడ్ల అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుతో ఏపీ సీఐడీ చంద్రబాబు సహా పలువురిపై కేసు నమోదు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబును ఏ1 గా పేర్కొంటూ విచారణ చేపట్టింది.

ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు సెప్టెంబర్ లో హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. శుక్రవారం ఏపీ సీఐడీ, చంద్రబాబు తరఫు లాయర్లు సమర్పించిన లిఖితపూర్వక వాదనలు పరిశీలించింది. శనివారం తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది.