భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీః సిఎం రేవంత్‌ రెడ్డి

cm-revanth-reddy-praises-on-pv-narasimha-rao-on-his-death-anniversary

హైద‌రాబాద్ : నేడు పీవీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వ‌ద్ద సిఎం రేవంత్ రెడ్డి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ న‌ర‌సింహారావు అని అన్నారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ అని సీఎం పేర్కొన్నారు. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయం. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్‌ల‌ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారు. పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది అని రేవంత్ అన్నారు.