2023-24 ఏడాదికి గాను లిక్కర్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్

జగన్ సర్కార్ 2023-24 ఏడాదికి గాను మద్యం విధానాన్ని ప్రకటించింది. 2019 నాటి విధానమే ఈ ఏడాది కూడా కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారంతో ఎక్సైజ్‌ విధానం గడువు ముగియనుండటంతో మరోమారు పాత విధానాన్ని పొడిగిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలో పేర్కొన్నట్టుగానే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మార్గంలో ఎలాంటి దుకాణానికి లైసెన్సు మంజూరు చేయబోమని స్పష్టం చేసింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని అబ్కారీ శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో 2,934 మద్యం దుకాణాలు కొనసాగుతాయని వెల్లడించింది. దుకాణాల లైసెన్సు కాల పరిమితి 2024 సెప్టెంబరు 30 వరకు వర్తిస్తుందని వివరించింది. నిర్దేశిత ఫీజు చెల్లించాక రిటైల్ దుకాణాలు, బార్ల లైసెన్సులు పొడిగిస్తారని ప్రభుత్వం పేర్కొంది. దుకాణాల సంఖ్యలో మార్పు లేకుండా, వాక్ ఇన్ స్టోర్లకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం సమ్మతించింది. మద్యం దుకాణాల్లో ఇకపై డిజిటల్ చెల్లింపులు కూడా అనుమతిస్తారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ పరిధిలో మద్యం అవుట్ లెట్లు, వాక్ ఇన్ షాపులకు ప్రత్యేక అనుమతి ఇస్తున్నట్ట తెలిపింది.