నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగుస్తున్నాయి. టీడీపీ నిరసనలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, విజిల్స్, అరుపులు, కేకలతో.. రెండు రోజులు సమావేశాలు వాడివేడిగా సాగాయి, ఆ తర్వాత ప్రతిపక్షం లేని సమావేశాలు మరో రెండు రోజులు కొనసాగాయి. ఈ రోజు ఆఖరు రోజు. నేడు సభలో రెండు కీలక బిల్లులు ప్రవేశ పెట్టనుంది జగన్ సర్కార్.

సీఎం జగన్ నేడు అసెంబ్లీలో మాట్లాడే అవకాశముంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పులో అక్రమాలపై అధికార పార్టీ సభ్యులు చర్చిస్తారు. ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, దేవాలయాల అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు-2023, ఏపీ అప్రోప్రియేషన్ బిల్లు-2023లను సభలో ప్రవేశ పెట్టనున్నారు. ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్-2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో ఈరోజు తీర్మానం ప్రవేశపెడతారు.