మంత్రిగా ములుగు నియోజక వర్గంలో అడుగుపెట్టిన మంత్రి సీతక్కకు ఘన స్వాగతం

ములుగు నియోజకవర్గం నుండి ఘన విజయం సాధించి..పంచాయితీ రాజ్ , మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన సీతక్క..మొదటిసారి నియోజకవర్గంలో అడుగుపెట్టిన సీతక్క కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ములుగు గట్టమ్మ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నేను పేదల కష్టాలు తెలిసిన పేదింటి ఆడ బిడ్డను మారుమూల గ్రామంలో పుట్టిన ఆదివాసి గిరిజన బిడ్డను అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగు, రంగుల గోడలు కాదు, ప్రతి ఒక్క పేదవారి నైతిక అభివృద్దే ఈ దేశ, రాష్ట్ర అభివృద్ధి అని నమ్మిన వ్యక్తిని తెలిపారు. ములుగు నియోజక వర్గంలో మొన్న జరిగిన ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు గుమ్మరించి నన్ను ఓడించాలని కుట్ర చేసిన వ్యక్తుల చెంప చెళ్లుమనిపించి నన్ను 33 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారు.

మీరు నాపైన చూపిన ప్రేమ నేను మరువలేనిది, మీరు నాపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ములుగు నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టంచేశారు. నేను ములుగు ప్రజలకు సేవకురాలుగా ఉంటా, ములుగు నుండే పాలన కొనసాగిస్తానని, రాష్ట్రంలో ఉన్న గ్రామాలు అభివృద్ధి చెయ్యడం కోసమే నన్ను పంచాయితీ రాజ్ శాఖ ఇచ్చారని, ప్రగతి భవన్ ముందు పేదలకు అడ్డుగా ఉన్న ఇనుప కంచెలు తొలిగించామని, ప్రజలకు సుపరిపాలన అందిస్తానని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీతక్క అన్నారు.