అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్
ముంబయిః నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ అస్వస్థత కారణంగా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు.ఈ మేరకు ఎన్సీపీ ట్వీట్ చేసింది. 81 ఏళ్ల వయసున్న శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించినట్లు తెలిపింది. అయితే ఆయన ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం శరద్ పవార్, నవంబర్ 4 నుంచి 5 వరకు షిర్డీలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించింది. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో నవంబర్ 8న శరద్ పవార్ పాల్గొంటారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి.
కాగా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గత ఏడాది ఏప్రిల్ 11న కూడా ఆసుపత్రిలో చేరారు. ఆయన గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నట్లు గతంలో నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స షెడ్యూల్కు ముందు రోజున ఆయన హాస్సిటల్లో అడ్మిట్ అయ్యారు. గత ఏడాది మార్చి 30న పిత్త వాహికలోకి జారిన పిత్తాశయ రాళ్లలో ఒకదాన్ని తొలగించడానికి ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ చోలాంగియోపాంక్రియాటోగ్రఫీ (ఈఆర్సీపీ) ప్రక్రియను చేయించుకున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/