అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి

హైదరాబాద్‌ః ప్రపంచం లోనే అతి పెద్ద బర్మా టేకు జాతి మహా వృక్షము ఇది. ఇరవై ఒక్క అడుగులు పొడవు, ఎనిమిదిన్నర అడుగుల ఎత్తు, ఇరవై అడుగుల కైవారం కలిగిన టేకు దుంగ..దాని వయసు సుమారు వెయ్యి నుండి పదిహేను వందల సంవత్సరాలు. ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రపంచం లోనే అరుదైన ఈ టేకు దుంగ ను అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ సంస్థ వారు ..బర్మా గవర్నమెంట్ , ఇంటర్నేషనల్ వేలం పాట లో భారీ మొత్తంలో ఖరీదు చేసి విజయవంతంగా దక్కించుకున్న అరుదైన వృక్ష ఖండ మిది. ఈ చెట్టును వ్యాపార నిమిత్తం కోసి ముక్కలు చేయకుండా భావి తరాలకు దీని భవ్య రూపాన్ని పదిలపరచాలని, చెడగొట్టకుండా, దీనిని అద్భుతమైన శిల్ప కళా ఖండంగా తీర్చిదిద్ది రాబోయే తరాలకు ప్రదర్శన యోగ్యమైన రీతిలో అందించాలనే సదుద్దేశ్యంతో తో ఆ విశేషమైన వృక్ష ఖండాన్ని శిల్పంగా చేయించాలని , సంస్థ వారు గట్టిగా సంకల్పించారు. ఈ బృహత్ ప్రణాళికకు సమర్థుడైన చిత్రకారుని అన్వేషించారు. అప్పుడు వారి దృష్టికి గిరిధర గౌడ్ దొరికారు . అంతే.. అతనితో ప్రణాళిక సిద్ధం చేయించి, చాలా రేఖా చిత్రాలను గీయించి వాటిని బర్మా గవ్నమెంట్ కు చూపించి పర్మిషన్ కొరకు అప్లయ్ చేయగా అతి కష్టమైన రీతిలో సంవత్సరం కాలం తర్వాత అధికారిక అంగీకారం వచ్చింది. తరువాత యోగ్యులైన బర్మా శిల్పులతో శిల్పం పూర్తి చేయించి ఇండియా తీసుకుని రావడానికి మరలా రెండు నుండి మూడు సంవత్సరాలు సమయం పట్టింది ,అక్కడ చెక్కి ప్రభుత్వానికి చూపించి అనుమతి సంపాదించారు. అప్పుడు దాన్ని ఓడమీద భారతతీరానికి చేర్చారు. చుట్టూ భద్రత కొరకు భారీ ప్యాకింగ్ పద్దతి ని అవలంబించి, పెద్ద కంటెయినర్ లో దాన్ని హైదరాబాదుకు చేర్చారు.

ఇప్పుడు బోయినపల్లిలోని అనూరాధా టింబర్స్ ఇంటర్నేషనల్ ప్రాంగణంలో ఆ శిల్పాన్ని గిరిధర్ ఊహించినట్టుగా పూర్తి వివరాలతో శిల్పం పూర్తి అయింది. ఈ దారు శిల్పం పేరు శ్రీ అనంత శేష శయన శ్రీ మహా విష్ణుమూర్తి దీనిని శ్రీమత్ భగవత్ గీత 11 వ అధ్యాయం -6 వ శ్లోకం ను స్ఫూర్తిగా తీసుకుని రాయన గిరిధర గౌడ్ చే చిత్ర ప్రణాళిక ప్రకారము శిల్పాన్ని పూర్తి చేశారు. ఇందులో పెద్ద మరియు చిన్న శిల్పాలు సుమారు 84 ఉన్నాయి . శ్లో: పశ్యాదిత్యాన్, వసూన్ రుద్రాన్అశ్వినౌ, మరుతస్థథా, బహూన్యదృష్టపూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత! ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు తనలోని వారే అని మహావిష్ణువు చెప్పిన వాక్కు ను ఆధారం గా శిల్పం చెక్కబడింది. శ్రీ మహావిష్ణువును అనంతశయన మూర్తిగా శిరస్సు ఎడమ వైపునకు, పాదాలు కుడివైపునకు ఉండేటట్టు చెక్కారు, అనంతశేషుని దివ్యమంగళమైన పడగల కింద కిరీటం ధరించి. దివ్యాభరణములతో శ్రీ మహా విష్ణువు, మరియు శ్రీదేవి , భూదేవి సమేతంగా చెక్కబడింది , ఆ పక్క వాసుకి భగవంతునికి వినమ్రతతో నమస్కరిస్తూ , విప్పారిన రెక్కలతో పక్షిరాజు గరుత్మంతుడు, నారదమహర్షి, తుంబురుడు,సప్త ఋషులు, విష్ణు భక్తులైన సనక సనందనాదులు ఉన్నారు. సకల దేవతా మూర్తులు ఉపస్థితమై ఉన్నట్లు చెక్కబడింది. ఇటువంటి అరుదైన విశిష్టత గలిగిన అపురూపమైన కళా ఖండాన్ని ప్రదర్శన యోగ్యంగా ఆవిష్కరించడానికి మాజీ భారత ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, బోయనపల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ సంస్థ కు 1 జూన్ 23 , శనివారం నాడు ఉదయం 8.30 ని . ఆవిష్కరణ కు హాజరయ్యారు.