బెంగళూరు విమానాశ్రయంలో రూ.10లకే భోజనం

కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ధరలతో ఇబ్బందిపడుతున్న ప్రయాణికులకు ఓ శుభవార్త తెలిపింది. బెంగుళూరు విమానాశ్రయంలో కేవలం 10 రూపాయలకే భోజనం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ‘ఇందిరా క్యాంటీన్’ను విమానాశ్రయంలో ప్రారంభించాలని కర్ణాటక కేబినెట్ సమావేశం నిర్ణయించింది. సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సామాన్యులు కొనే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రూ.10లకే భోజంన, రూ.5లకే టిఫిన్ అందించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ మేరకు బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఖరీదైన ఫుడ్ అవుట్‌లెట్లలో కూడా సామాన్యులు, మధ్యతరగతి వారికి ఆహారం అందించాలన్న లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న ‘ఇందిరా క్యాంటిన్’ భాగంగా ఎయిర్‌పోర్టులోని పార్కింగ్ ప్రదేశంలో 2 క్యాంటిన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే వాటిని ప్రభుత్వం ప్రారంభించనుంది. కాగా బెంగళూరు నగరంలో 175కి పైగా ఇందిరా క్యాంటీన్‌లు ఉన్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇందిరా క్యాంటీన్‌లలో కేవలం రూ. 5కే అల్ఫాహారం, రూ. 10కే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.