మరికాసేపట్లో హైదరాబాద్ కు అమిత్ షా రాక

బిజెపి కేంద్ర మంత్రి అమిత్ షా మరికాసేపట్లో హైదరాబాద్ కు రాబోతున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ఎన్నికల కార్యాచరణ, లోక్‌సభ ఎన్నికల విష‍యంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని కొంగరకలాన్ లో ఈ సమావేశం జరగనుంది.

ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆయన నొవోటెల్ హోటల్ కు వెళ్తారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత కొంగరకలాన్ కు వెళ్లి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. కె. లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, ప్రకాశ్ జవదేకర్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు హాజరుకానున్నారు.