టిడిపిలో చేరిన అంబటి కీలక అనుచరుడు
బత్తుల ఆదినారాయణను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కన్నా లక్ష్మీనారాయణ
అమరావతిః ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు పెద్ద షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు, సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది బత్తుల ఆదినారాయణ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో ఆయన టిడిపిలో చేరారు. ఆదినారాయణ కాపునాడు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. బత్తుల ఆదినారాయణ టిడిపిలో చేరడం సత్తెనపల్లి వైఎస్ఆర్సిపిలో చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… ఆదినారాయణ వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరారని చెప్పారు. ఆయనను టిడిపిలోకి సాదరంగా ఆహ్వానించామని తెలిపారు. అందరినీ కలవగలిగిన, కలపగలిగిన ప్రముఖ న్యాయవాది, కాపు సంఘం అధ్యక్షుడు ఆదినారాయణను టిడిపిలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్సిపి నుంచి టిడిపిలో చేరినందుకు వారిని తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాని చెప్పారు. రాష్ట్రానికి వైఎస్ఆర్సిపి రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించడానికి, టిడిపి అధికారంలోకి రావడానికి ప్రజలతో పాటు, మేదావులు అందరం కలిసి పని చేద్దామని చెప్పారు.