సైకో పాలన పోవాలంటూ టీడీపీ నేతల వ్యాఖ్యలపై అంబటి ఆగ్రహం

ఏపీ అసెంబ్లీ లో రెండో రోజు కూడా తీవ్ర గందరగోళం నడుమ మొదలైంది. మొదటి రోజు ఎలాగైతే టీడీపీ నేతలు పోడియం చుట్టుముట్టి చంద్రబాబు ఫై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసారో..రెండో రోజు కూడా అదే తరహాలో డిమాండ్ చేయడం తో అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్ పోడియం వద్ద ప్లకార్డులను ప్రదర్శించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని, సైకో పాలన పోవాలని వారు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది టీడీపీ కార్యాలయం కాదని మంత్రి అంబటి మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్, ఆయన అవినీతిపై చర్చకు తాము సిద్ధమని… అయితే, సభలో రచ్చ చేయాలని టీడీపీ సభ్యులు చూస్తున్నారని దుయ్యబట్టారు. చట్టసభలో జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని , సీఎం జగన్ ను ఉద్దేశించి అసహ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.