అమరావతే నిలుస్తుందని, అమరావతే గెలుస్తుందని: చంద్రబాబు ధీమా

పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయిందన్న చంద్రబాబు

chandrababu

అమరావతి : ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా గుర్తు చేసారు. కనీసం వెయ్యేళ్ల పాటు తెలుగుజాతి గుండె చప్పుడుగా అమరావతి నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని… అయితే, పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతి అంటే 28 వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పమని చంద్రబాబు అన్నారు. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారని చెప్పారు. ఎన్నికలకు ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి… అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశాడని జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. అమరావతి రైతుల మహా పాదయాత్రపై వైస్సార్సీపీ కుతంత్రాలు సాగవని అన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతే అని… అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుందని చెప్పారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుందని అన్నారు. నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుందని, అమరావతే గెలుస్తుందని… ఇదే ఫైనల్ అని ధీమా వ్యక్తం చేశారు.