ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అలీ

ఏపీ సర్కార్ నటుడు , వైస్సార్సీపీ నేత అలీని ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారుగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం అలీ తన బాధ్యతలను స్వీకరించారు. అధికారులు వెంట రాగా తన చాంబర్ లో ప్రవేశించారు. ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ చేతుల మీదుగా బాధ్యతలు అందుకున్నారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. తనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించడం పట్ల సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై సీఎం జగన్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా తాను ఏంచేయాలన్నది ఓ వారంలో ఖరారవుతుందని వెల్లడించారు.

సీఎం జగన్ మనసున్న మనిషి అని, వచ్చే ఎన్నికల్లోనూ వైస్సార్సీపీదే విజయం అని స్పష్టం చేశారు. సీఎం జగన్ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టి పెడతానని అలీ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో ఇటీవల తాను షూటింగ్ కు వెళ్లానని, అక్కడ బీచ్ లు, రోడ్లు చూసిన తర్వాత, వాటిని డెవలప్ చేస్తే తెలుగు సినిమాలే కాకుండా పర భాషా చిత్రాలు కూడా ఇక్కడ షూటింగులు జరుపుకుంటాయని అనిపించిందని అలీ అభిప్రాయపడ్డారు.