నేడు సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ

సమాజ్ వాది పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేడు హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకి BRS హాజరుకాని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలుమార్లు అఖిలేష్ యాదవ్..కేసీఆర్ తో సమావేశమై పలు రాజకీయాలపై చర్చించుకున్న సంగతి తెలిసిందే.

ఇక నిన్న ఖమ్మం లో జరిగిన కాంగ్రెస్ జన గర్జన సభ గ్రాండ్ సక్సెస్ కావడం తో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే..అధికార పార్టీ బిఆర్ఎస్ నేతలు మాత్రం విమర్శలు చేయడం మొదలుపెట్టారు. రాహుల్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బంగాళాఖాతంలో ఆల్రెడీ నిండా మునిగిన పార్టీ కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శించారు. ‘మా తొమ్మిదేళ్ల పాలన…. వెలుగుల ప్రస్థానం. గత కాంగ్రెస్ పదేళ్ల పాలన… చీకటి అధ్యాయం. కారు స్టీరింగ్ KCR చేతిలో పదిలం కానీ కాంగ్రెస్ పైనే రాహుల్ కు కంట్రోల్ తప్పింది. బీఆర్ఎస్ ను విస్తరిస్తే అంత వణుకెందుకు. జాతీయ రాజకీయాలు మీ జాగీరా. దేశానికి దొరికిన వజ్రాయుధం…BRS’ అని ట్వీట్ చేశారు.

దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు హరీశ్ రావు. మీ పార్టీ పేరు స్కాంగ్రెస్ అని ధ్వజమెత్తారాయన. రాహుల్ గాంధీ గారు.. దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది. అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీది. అందుకే మీ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారింది. అందుకే దేశ ప్రజలు మిమ్మ‌ల్ని అధికారం నుంచి దించి మూల‌న కూర్చోబెట్టింది.

బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీం కాదు..
మాది పేదలకు ఏ టీం
ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం
బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు
అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టింది

రాష్ట్రంలో పొడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా..?
మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరెచ్చేదేంది?
అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియ‌న్ రాహుల్‌ గాంధీ

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం 80,321.57 కోట్లు అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్.
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ ఇవ్వ‌లేద‌ని మీ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలియ‌దా?
స్కీమ్ ల్లోని స్కాంల్లో ఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించ‌డ‌మే

అప్పుడే ముదిగొండ కాల్పులను మరిచిపోయారా? భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడుగుతే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు ఖమ్మంలో కల్లిబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు..

ఖ‌మ్మం స‌భ ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్..” అని కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీశ్ రావు.