కేసీఆర్ భార్య శోభకు అస్వస్థత..

సీఎం కేసీఆర్ భార్య శోభకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి కి తరలించారు. ప్రస్తుతం డాక్టర్స్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ సైతం ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు. అలాగే పలువురు మంత్రులు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. శోభ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి కేసీఆర్ తెలుసుకుంటున్నారు.

ప్రస్తుతం శోభ ఆరోగ్యం నిలకడకానే ఉందని వైద్యులు చెబుతున్నారు. హరీశ్, కేటీఆర్ ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నట్లు సమాచారం. కొన్ని వైద్య పరీక్షల తర్వాత శోభ డిశ్చార్జ్ అవుతారని.. సతీమణితో కలిసే కేసీఆర్ ఇంటికెళ్తారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. ఈడీ విచారణలో ఏం జరిగిందనే దానిపై చర్చించారు. ఈ నెల 16న మరోసారి విచారణకు వెళ్లడంపై చర్చించారు. ఈ సమావేశం జరిగిన కొద్దిసేపట్లోనే శోభ అస్వస్థతకు గురయ్యారు.

సాయంత్రం మరోసారి కవితతో కేసీఆర్ భేటీ కానున్నారు. రెండోసారి ఈడీ విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో.. భవిష్యత్తు పరిణామాలపై చర్చించనున్నారు. ఈడీ విచారణను ఎలా ఎదుర్కొవాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.