సీతంపేటలో దారుణం : అల్లరి చేస్తుందని చిన్నారి ముఖంపై అగ్గిపుల్ల కాల్చి చురకలు పెట్టిన ఆయా

చిన్న పిల్లలు అల్లరి చేయడం అనేది సాధారణం..ఆ అల్లరిని చూసి చూడనట్లు ఉండాలి కానీ అల్లరి చేస్తుందని చిన్నారిని కొట్టడం , వాతలు పెట్టడం చేయకూడదు. అయితే తాజాగా ఓ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి అల్లరి చేస్తుందని ఆ చిన్నారి ముఖంపై అగ్గిపుల్ల కాల్చి చురకలు పెట్టింది ఓ ఆయా. ఈ ఘటన విశాఖపట్టణంలోని సీతంపేట పరిధి రాజేంద్రనగర్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే..కనకమ్మవారి వీధి అంగన్‌వాడీ కేంద్రంలో ఓ చిన్నారి అల్లరి చేస్తుండడంతో రేష్మా అనే ఆయా ఆగ్రహం తో ఊగిపోయింది. చిన్న పిల్ల అని కూడా చూడకుండా అగ్గిపుల్ల వెలిగించి చిన్నారి ముఖంపై చురకలు పెట్టింది. బాధ భరించలేని చిన్నారి ఏడుస్తూ కేకలు వేస్తున్నా ఆమె వదల్లేదు. అలాగే చురకలు పెడుతూ వచ్చింది. బాలిక ముఖంపై కాలిన గాయాలను తల్లి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కాగా, అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్న భవనంపైనే సీడీపీవో కార్యాలయం ఉండడం గమనార్హం. ఈ ఘటనపై స్పందించిన సీడీపీవో.. సూపర్‌వైజర్‌ను బాధిత బాలిక ఇంటికి పంపి విచారణ చేస్తున్నట్టు తెలిపారు. సదరు ఆయా ఫై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.