శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా గురువారం ఉదయం VIP బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం.. ఆలయ అర్చకులు రజనీకాంత్ కు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈరోజు కడప అమీన్‌పీర్‌ దర్గాను రజనీకాంత్ దర్శించుకోనున్నారు. ఆయనతో పాటు ఏఆర్‌ రెహమాన్‌ కూడా వెళ్లనున్నారు. కాగా.. శ్రీవారి దర్శనం కోసం రజినీకాంత్‌ బుధవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. టీఎస్‌ఆర్‌ అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ రిసెప్షన్‌ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, ఓఎస్డీ రామకృష్ణ స్వాగతం పలికారు.

ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నాడు. మొన్ననే రజిని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. బీస్ట్ ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక ముఖ్యపాత్రలో కనిపిస్తున్నాడు.