డీఏవీ స్కూల్ ఘటనపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
డీఏవీ స్కూల్ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేసారు. ‘‘నాలుగేళ్ల పసిబిడ్డపై జరిగిన అత్యాచారం, అఘాయిత్యం నన్ను కలచివేసింది. ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకి కఠినాతి కఠినమైన శిక్షలు వేగంగా విధించాలి. అలానే ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాట్లకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. భావితరాలకి భరోసా కల్పించడం మనందరి సమష్టి బాధ్యతగా భావిస్తున్నాను’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
మరోపక్క ఈ ఘటన తో పాఠశాల గుర్తింపును రద్దు చేయాలంటూ విద్యాశాఖ అధికారిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేలా పక్కనే ఉన్న పాఠశాలల్లో సర్ధుబాటు చేయాలని సూచించారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసే బాధ్యత పూర్తిగా జిల్లా విద్యా శాఖ అధికారిదేనని మంత్రి తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలను ప్రభుత్వానికి సూచించేందుకు విద్యా శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉంటె స్కూల్ గుర్తింపు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. అంతేకాకుండా సంతకాల సేకరణ కూడా చేపట్టారు. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కమిషనర్కి సంతకాల సేకరణతో కూడిన వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఆ స్కూల్లో దాదాపు 600కి పైగా విద్యార్థులు చదువుతున్నట్లు చెప్తున్నారు. స్కూల్ గుర్తింపు రద్దుతో వారి భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.