దేశంలో కొత్తగా 7,178 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 78,342 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 7,178 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 65,683 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,4,30,1,865 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,345కి ఎగబాకింది.

మరోవైపు కొవిడ్‌ కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ.1.16 (XBB.1.16) వేరియంట్‌ కారణమని వైద్య నిపుణులు తెలిపారు. అయితే, కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. ఈ వేరియంట్‌ మరీ అంత శక్తిమంతమైనది ఏమీ కాదని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.15 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.67 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉందని పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.