ఏపిలో 70 శాతం మంది ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారుః కేఏ పాల్
వైఎస్ఆర్సిపి పాలనలో ఆదాయం పెరగలేదు..అక్రమాలు, అప్పులు పెరిగాయన్న కేఏ పాల్
అమరావతిః ఏపీలో 60, 70 శాతం ప్రజలు తనను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కేజ్రీవాల్ ను ఢిల్లీ ప్రజలు గెలిపించారని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన తనను ఏపీ ప్రజలు ఎందుకు గెలిపించరని ప్రశ్నించారు. త్వరలో 8 లక్షల కోట్లు రాష్ట్రానికి తీసుకువస్తానని చెప్పారు.
ఏపీలో అవినీతిని అంతం చేయాలని కేఏ పాల్ అన్నారు. నాలుగేళ్లలో సిట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సీబీఐతో ఎంక్వైరీ కూడా చేయించాలన్నారు. బొత్సకు లక్ష కోట్ల విలువైన ఆస్తులు వచ్చాయని, దీనిపై సిట్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వస్తే ఏపీని మింగేస్తాడని బిజెపి పెద్దలకు చెప్పాననని పాల్ అన్నారు. వైఎస్ఆర్సిపిలో అవినీతిపరులందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సిపి పాలనలో ఆదాయం పెరగలేదు కానీ అక్రమాలు, అప్పులు మాత్రం పెరిగాయని ఎద్దేవా చేశారు.