636కు చేరిన కరోనా వైరస్ మృతులు
ఒక్కరోజులో 73 మంది బలి
బీజింగ్: కరోనా వైరస్ చైనాతోపాటూ దాదాపు 30 దేశాల్లో విస్తరించింది. కాగా చైనాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 636కు చేరింది. గురువారం ఒక్కరోజే 73 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 31,000 మందికి పైనే ఈ వైరస్ సోకినట్లు వెల్లడించారు. వైరస్కి కేంద్రంగా ఉన్న వుహాన్లో 69 మంది మృత్యుఒడికి చేరారు. మరో 3,143 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు వ్యాధి నుంచి కోలుకొని 1,540 మంది ఆస్పత్రి నుంచి విడుదలయ్యారు. వైరస్ నుంచి విముక్తి పొందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని వైద్యులు తెలిపారు. చైనాలో ఉన్న 19 మంది విదేశీయులకు వైరస్ సంక్రమించినట్లు అధికారులు ధ్రువీకరించారు. వారు ఏ దేశానికి చెందినవారన్నది మాత్రం బహిర్గతం చేయలేదు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న చైనా గురువారం మరో 1500 పడకల ఆస్పత్రిని ప్రారంభించింది. మొబైల్ వంటి తాత్కాలిక క్లినిక్లను సైతం నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు చైనాకు ప్రయాణించడంపై విదేశాలు విధిస్తున్న నిషేధించడం పట్ల చైనా ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/