దేశవ్యాప్త నిరసనకు‘ఇండియా’కూటమి పిలుపు..ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి

పార్లమెంటు నుంచి 146 మంది ఎంపీల సస్పెన్షన్

india-bloc-today-protest-against-central-government-over-mps-suspension

హైదరాబాద్‌ః పార్లమెంటు నుంచి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ‘ఇండియా’ కూటమి నేడు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నెల 13న కొందరు దుండగులు లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించి పొగబాంబు వదిలి నానా హంగామా చేశారు. బిజెపి ఎంపీ సిఫార్సు ద్వారానే వారు లోక్‌సభలోకి రాగలిగారని, ఈ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన విపక్ష ఎంపీలను ఉభయ సభల నుంచి సస్పెండ్ చేశారు.

పార్లమెంటు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏకంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి బయటకు పంపారు. కాంగ్రెస్ కూటమి దీనిని నిరసిస్తూ నేడు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతోపాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారు.