ఘోర రైలు ప్రమాదం ..30 మంది మృతి
పాకిస్థాన్లో ఢీకొన్న రెండు రైళ్లు
ఇస్లామాబాద్ : సోమవారం తెల్లవారు జామున పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో 30 మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు గాయపడ్డారు. రెతి – దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య మిల్లట్ ఎక్స్ప్రెస్, సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. అయితే, పట్టాలు తప్పిన సర్ సయ్యద్ ఎక్స్ప్రెస్ రైలును.. మిల్లట్ ఎక్స్ప్రెస్ను ఢీకొట్టిందని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనలో 30 మంది మృతి చెందారని సింధ్ ప్రావిన్స్లోని ఘోట్కి జిల్లాలో పోలీసు అధికారి ఉస్మాన్ అబ్దుల్లా చెప్పారు. గాయపడ్డ వారిని దవాఖానాలకు తరలించారు. రెండు రైళ్ల బోగీల్లో చాలా మంది ప్రయాణికులు చిక్కుకున్నారని పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత ఆ రూట్లో నడిచే రైళ్లను నిలిపి వేసినట్లు అబ్దుల్లా చెప్పారు. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/