బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం : చెరువులోకి దూసుకెళ్లిన బస్సు ..17 మంది మృతి

బంగ్లాదేశ్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. భండారియా ఉప జిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు 70 మందితో వెళ్తున్న బస్సు ఝలకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని ఛత్రకాండ ప్రాంతంలో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ గౌతమ్ కుమార్ ఘోష్ తెలిపారు.

35 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. భండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్‌పూర్‌కు వెళ్తున్న ఈ బస్సు స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా అదుపుతప్పి చెరువులో పడిపోయింది. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.