దేశంలో కొత్తగా 17, 336 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ రోజు వారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 17 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 4 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 17, 336 మంది పాజిటివ్ గా తేలారు. ఫిబ్రవరి తర్వాత ఒక రోజులో 17 వేల పైచిలుకు కేసులు రావడం ఇదే తొలిసారి. గురువారం 13 వేల పైచిలుకు మందికి వైరస్ సోకితే ఒక్క రోజులోనే కొత్త కేసుల సంఖ్య 4294 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసుల్లో ఏకంగా 30 శాతం పెరుగుదల నమోదైంది. పాజిటివిటీ రేటు 4.32గా ఉంది. ఈ వారం మొత్తం పాజిటివిటీ రేటు 3.07గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం దేశంలో 88,284 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటిదాకా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 4,33,62,294కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల 13 మంది మరణించారు. దాంతో, భారత్ కరోనా మరణాల సంఖ్య 5,24,954కు చేరుకుంది. ఇప్పటిదాకా 196 కోట్ల పైచిలుకు వ్యాక్సిన్లు అందజేసినట్టు కేంద్రం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 13.7 లక్షల మందికి టీకాలు అందించామని తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/