మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొని ఒక ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగడంతో 13 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే గుణ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

బుధవారం రాత్రి మధ్యప్రదేశ్‌ గుణ జిల్లా నుంచి ఆరోన్ వైపు ఓ ప్రయివేటు బస్సు స్టార్ట్ అయ్యింది. సరిగ్గా రాత్రి 8.30గంటల ప్రాంతంలో అతివేగంగా వస్తున్న బస్సు ట్రక్కును ఢీ కొట్టి బోల్తాపడింది. దీంతో బస్సులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి 13 మంది ప్రయాణికులు సజీవదహమవ్వగా మరో 17 మంది తీవ్రగాయాలపాలయ్యారు. మంటల్లో చిక్కుకున్న పలువురిని స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. చీకట్లో డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ విచారణకు ఆదేశించారు. బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు 50 వేల చొప్పున, మృతుల కుటుంబాలకు 4 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా అందించాలని ఆదేశాలు జారీ చేశారు.