రేపటి నుంచి ఆర్టీసీ బస్‌లో మహిళలకు జీరో టికెట్లు

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు హామీలను నెరవేర్చే పనిలో ఉంది. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే సీఎం రేవంత్..మహాలక్ష్మి , రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల్లో నమ్మకం పెంచారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యానికి మహిళల నుండి విశేష స్పందన వస్తుంది.

ఈ క్రమంలో మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్రస్థాయి అధికారులతో గురువారం సజ్జనార్ వర్చువల్‌గా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రేపటి నుంచి జీరో టిక్కెట్లు ఇవ్వనున్నట్లు సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్‌ను తీసుకుని ఆర్టీసీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా పథకం అమలవుతోందని, పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ను.. సంస్థ అప్ డేట్ చేసిందని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ను టిమ్ మెషిన్లలో ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు వెల్లడించారు. మెషిన్ల ద్వారా శుక్రవారం నుంచి జీరో టికెట్లను జారీ చేయనున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని సూచించారు.