పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభ ప్రారంభం
హాజరవుతున్న చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ
అమరావతిః టిడిపి అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగిసిన సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో నేడు యువగళం విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు. యువగళం నవశకం పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభ కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టిడిపి-జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చాయి. దాంతో సభా ప్రాంగణం అంతా జనసంద్రాన్ని తలపిస్తోంది.
ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, బాలకృష్ణ హాజరు కానున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. పొత్తు నేపథ్యంలో, నేటి యువగళం సభ ద్వారా ఇరు పార్టీల అధినేతలు ఉమ్మడిగా పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.