కాంగ్రెస్లో చేరిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే
అమరావతిః ఏపీ అధికారపక్షం వైఎస్ఆర్సిపిలో మరో వికెట్ పడింది! ఆ పార్టీని వీడుతున్న వారి జాబితా ఏ రోజుకారోజు పెరుగుతూ ఉంది. తాజాగా, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా వైఎస్ఆర్సిపికి గుడ్ బై చెప్పారు. ఎంఎస్ బాబు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో ఎంఎస్ బాబు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కడపలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంఎస్ బాబుకు కాంగ్రెస్ కండువా కప్పిన షర్మిల ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఇటీవల కాలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎంపీలు వైఎస్ఆర్సిపిని వదిలి వెళ్లిపోతుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాలామంది సిట్టింగ్ లకు ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అధినాయకత్వం టికెట్ నిరాకరించడమే ఈ వలసలకు కారణమని తెలుస్తోంది.