వైఎస్ఆర్సిపికి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా
![](https://www.vaartha.com/wp-content/uploads/2024/03/YSRCP-minister-Gummanur-Jayaram-resigns-1024x576.jpg)
అమరావతిః అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్ఆర్సిపికి షాక్ లు తగులుతున్నాయి. వైసీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా చేశారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. గుమ్మనూరు అనుచరులు పెద్ద ఎత్తున విజయవాడ చేరుకున్నారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన గుమ్మనూరు జయరాం… వైఎస్ఆర్సిపి , ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ మంగళగిరిలో టిడిపి, జనసేన ఆధ్వర్యంలో నిర్వసిస్తున్న జయహో బీసీ సభలో… చంద్రబాబు సమక్షంలో టిడిపి లో చేరుతున్నట్లు జయరాం తెలిపారు.
సీఎం జగన్ విధానాలపై విసుగుచెందానని గుమ్మనూరు విమర్శలు చేశారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ కోరారని, అది తనకు ఇష్టం లేదన్నారు. టిడిపి తరఫున గుంతకల్లు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గుడిలో శిల్పంలాగా జగన్ తయారయ్యారని, తాడేపల్లిలోని ఇద్దరు పూజారులు ఉన్నారని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి చెప్పిందే జగన్ చేస్తున్నారని గుమ్మనూరు ఆరోపించారు.
ఈసారి కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ తనను కోరారని, కానీ ఆ ప్రతిపాదన తనకు నచ్చలేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని గుమ్మనూరు జయరాం చెప్పారు.