కేసీఆర్ దెబ్బ అంటే ఆలా ఉంటుంది – కేటీఆర్
బిఆర్ఎస్ కు మొదటి విజయం సాధించిందన్నారు ఐటీ మంత్రి కేటీఆర్..మొన్నటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాల్సిందే అని పట్టుబట్టిన కేంద్రం..ఇప్పుడు బిఆర్ఎస్ దెబ్బకు వెనుకడుగు వేసింది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోందని కేంద్రమంత్రి ప్రకటించారు. ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామన్నారు. ఈ ప్రకటన పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు.
విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది మన కేసీఆరే అని స్పష్టం చేశారు. మేం తెగించి కొట్లాడాం కాబట్టే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటదని కేటీఆర్ స్పష్టం చేశారు.
మొదటి నుండి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తు వస్తున్న కేసీఆర్..విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించారు. ఫ్యాక్టరీ నిర్వహణకు కావాల్సిన నిధులు ఇచ్చి ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ముందడుగు వేయడం తో ప్రతిపక్ష పార్టీలు , రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నిర్ణయం ఫై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రం ఫై ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.
దీంతో కేంద్రం ఆలోచనలో పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతానికి ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ స్పష్టం చేశారు. ఆర్ఐఎన్ఎల్ ను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యంతోనూ.. అలాగే కార్మిక సంఘాల నేతలతోనూ చర్చిస్తామని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు విశాఖలో కేంద్ర ఉక్కుగనుల సహాయ ఫగ్గన్ సింగ్ ప్రకటించారు.