చంచల్ గూడ జైల్లో షర్మిలను పరామర్శించిన వైస్ విజయమ్మ

చంచల్ గూడ జైల్లో ఉన్న షర్మిలను వైస్ విజయమ్మ పరామర్శించారు. పోలీసులపై దాడి కేసులో వైఎస్‌ షర్మిలను అరెస్ట్ చేసి , ఆమె ఫై 353, 332, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన అనంతరం టీ సేవ్ నిరాహార దీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరాలని షర్మిల నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉదయం ఇంటి నుండి షర్మిల బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేయగా వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నందుకు గాను ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

షర్మిల సహా ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ1గా షర్మిల, ఏ2గా కారు డ్రైవర్ బాలు, ఏ3గా మరో డ్రైవర్ జాకబ్ పేర్లను చేర్చారు. షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వాదనలు విన్న కోర్ట్ షర్మిలకు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. మే 8వ తేదీ వరకు షర్మిల జ్యూడీషియల్ రిమాండ్ కొనసాగుతుంది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న షర్మిలను ..మంగళవారం ఉదయం వైస్ విజయమ్మ పరామర్శించారు.