రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కోమటిరెడ్డి ఆందోళన

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేయడాన్ని నిరసిస్తూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీ పై వేటుకు నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హత వేటు వేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మార్చి 23న ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పేర్కొన్నారు. రాహుల్ వెంట తామంతా ఉంటామని.. అవసరమైతే పదవులకు రాజీనామా కూడా చేస్తామని స్పష్టం చేశారు.

భారత్ జోడో యాత్రలో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారని.. ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ ఒక మాట అంటే దానిమీద కోర్టు తీర్పు ఇచ్చిందని.. నెల రోజుల సమయం ఇచ్చి వెంటనే స్పీకర్ అనర్హత వేటు వేయడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.