తెలంగాణ‌లో నిరుద్యోగులను ఎందుకు ఆదుకోరు?

అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న వారిని ఎందుకు ఆదుకోరు?

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ చేరుకున్నారు. కాసేప‌ట్లో ఆయ‌న గల్వాన్‌ అమర సైనికుల కుటుంబాలకు సాయం అందించ‌నున్నారు. దీనిపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల స్పందిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘గల్వాన్‌ లో అమరులైన సైనిక కుటుంబాలకు రూ.10. లక్షల చొప్పున‌ ఇవ్వడం తప్పు కాదు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పు లేదు. కానీ, తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు? 1200 మంది అమరులని ఉద్యమంలో గొంతుచించుకున్న మీకు అధికారంలోకి వచ్చాక కొందరే అమరులెందుకయ్యారు?

నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకొంటున్న వందల మంది నిరుద్యోగులను ఎందుకు ఆదుకోరు? అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న వేలమంది రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోరు? కనీసం నష్టపోయిన పంటకు పరిహారం ఎందుకివ్వరు? సొంత రాష్ట్రం వారిని అల్లం, బయటి వారిని బెల్లం చేసుకోవడమేనా బంగారు భారత్ కు బాట?’ అని ఆమె ప్ర‌శ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/