సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాసిన అవినాశ్ రెడ్డి

రెండో భార్య పేరిట ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకుపోవడానికి హత్య చేసి ఉండొచ్చని ఆరోపణ

ys-avinash-reddy-letter-to-cbi-director

అమరావతిః మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. వికేకా కూతురు సునీత, వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఈ కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కు లేఖ రాశారు. లేఖలో గతంలో సీబీఐ దర్యాప్తు అధికారి అయిన ఎస్పీ రామ్ సింగ్ పై ఆయన ఫిర్యాదు చేశారు. రామ్ సింగ్ చేసిన దర్యాప్తును పునఃసమీక్షించాలని కోరారు. వివేకా రెండో వివాహం, బెంగళూరులో ల్యాండ్ సెటిల్ మెంట్ అంశాలను లేఖలో ప్రస్తావించారు.

దస్తగిరి ఇచ్చిన సమాధానాల ఆధారంగా రామ్ సింగ్ విచారణ జరిపారని అవినాశ్ తెలిపారు. రెండో భార్య పేరిట ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకుపోవడానికే హత్య చేసి ఉండొచ్చని చెప్పారు. విచారణలో రామ్ సింగ్ చేసిన తప్పులను సవరించాలని కోరారు. మున్నా లాకర్ లో ఉన్న నగదుకు సంబంధించిన వివరాలను ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. హత్య చేసిన నిజమైన నేరస్తులను పట్టుకుని న్యాయం జరిగేలా చూడాలని కోరారు.