వివేకా హత్య..కుట్ర చేసింది అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డే..చార్జిషీట్లో సీబీఐ

గూగుల్ టేక్ అవుట్, ఫోన్ల లొకేషన్ డేటాలు, ఫొటోలను కోర్టుకు సమర్పించిన సీబీఐ

ys-avinash-reddy-and-bhaskar-reddy-conspiracy-for-viveka-murder

అమరావతిః మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలు కుట్ర చేశారని సీబీఐ తెలిపింది. ఈ మేరకు సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొంది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేతను కోర్టుకు వివరించింది. గూగుల్ టేక్ అవుట్, ఫోన్ల లొకేషన్ డేటాలు, ఫొటోలను కోర్టుకు సమర్పించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పింది. వివేకా పీఏ కృష్ణారెడ్డిపై అనుమానాలు ఉన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదని తెలిపింది.

సాక్ష్యాల చెరిపివేత సమయంలో అక్కడ మనోహర్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన ప్రమేయంపై నిర్ధారణ కాలేదని చెప్పింది. వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్ట్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నామని… వివరాలు ఇవ్వాలని అధికారులను కోరామని తెలిపింది. వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష నివేదిక రావాలని చెప్పింది. పలు మొబైల్ ఫోన్ల ఫోరెన్సిక్ రిపోర్టులు త్రివేండ్రం సీడాక్ నుంచి రావాల్సి ఉందని తెలిపింది.