ప్రకాశం జిల్లా టీడీపీలో ఊహించని పరిణామం

ప్రకాశం జిల్లా టీడీపీలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు పమిడి రమేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగా ఓ వీడియో విడుదల చేసారు. గత రెండేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేశానని.. తప్పులు ఏమైనా ఉంటే క్షమించాలి అని అన్నారు. టీడీపీ జెండా రెపరెపలాడటానికి దర్శి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పని చేశానని.. రాబోయే రోజుల్లో ఇతర నాయకులతో పాటు తాను కూడా నియోజకవర్గంలో టీడీపీ గెలుపునే కోరుకుంటున్నానని తెలిపారు. తనకు ఇంతకాలం సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

‘మహానాడు తర్వాత కొన్ని పరిణామాలు జరిగాయి. కొంతమంది ఆశావహులు దర్శి నియోజకవర్గంలో పోటీచేసేందుకు ఉత్సాహం చూపించారు. అధిష్టానం పిలవకపోయినా.. నేనే ప్రస్తావిద్దామని వెళ్లాను. అక్కడ పరిస్థితి, నేను ఇంతకాలం చేసిన పనికి, వాళ్లకు నా మీద ఉన్న అభిప్రాయానికి ఎలాంటి పొంతన లేదు. దీని గురించి విమర్శనాత్మకంగా మాడ్లాడటానికి ఇష్టపడటం లేదు. పార్టీ అధికారంలోకి రావడం మన ధ్యేయం, దర్శి నియోజకవర్గంలో టీడీపీ గెలవడం మన ఆశయం’అన్నారు. పమిడి రమేష్ ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని చెపుతున్నారు.