తెలంగాణలో మరో యువకుడు గుండెపోటుతో మృతి

తెలంగాణలో వరుస గుండెపోటు మరణాలు ఆగడం లేదు. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో యువకులు వరుసపెట్టి గుండెపోటుకు గురవుతూ మరణిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో మరణించగా..తాజాగా ఈరోజు మరో యువకుడు మరణించాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోనె సంతోష్ (33) అనే యువకుడు ఇంట్లో ఫోన్ మాట్లాడుతుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోనీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అతడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. యువకుని మృతితో కుటుంబంలో విషాదఛాయలనుకున్నాయి. గత ఐదు రోజుల్లో కామారెడ్డి జిల్లాలో గుండెపోటుకు గురై నలుగురు మృత్యువాత పడడటం భయాందోళనకు గురిచేస్తోంది.

మరోపక్క వరుస గుండెపోటు మరణాల పట్ల తెలంగాణ సర్కార్ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. కార్డియోపల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్‌)లో లక్షమందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. అలాగే, అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినవారికి అపర సంజీవనిలా పనిచేసే ఆటోమెటిక్‌ ఎక్స్‌టర్నల్‌ డీఫిబ్రిలేటర్‌ (ఏఈడీ) పరికరాలను తెప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. పబ్లిక్‌ ప్లేస్‌లలో ఏర్పాటుచేసేందుకు 1400 పరికరాలకు ఇప్పటికే ఆర్డర్‌ ఇచ్చినట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

ప్రపంచస్థాయి నగరాల్లో ఇప్పటికే పబ్లిక్‌ యాక్సెస్‌ డీఫీబ్రిలేటర్లు గుండెపోటు బాధితులకు ఊపిరిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ముఖర్జీ ఇతర దేశాల్లో మాదిరిగా హైదరాబాద్‌లోనూ పబ్లిక్‌ యాక్సెస్‌ డీఫిబ్రిలేటర్లను ఏర్పాటుచేయాలని ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్‌.. మొదటి విడతలో 1400 డీఫిబ్రిలేటర్లకు ఆర్డర్‌ ఇచ్చినట్టు ప్రకటించారు. వీటిని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, మాల్స్‌, ప్రభుత్వ కార్యాలయాలవంటి బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులోకి తేనున్నారు.