జీ-20 సదస్సుకు ప్రధాని లీ కియాంగ్ హాజరు: చైనా ప్రకటన

తన స్థానంలో ప్రధాని లీకియాంగ్ ను పంపుతున్న జిన్ పింగ్

Xi to miss G20 in New Delhi, China says Premier Li Qiang will attend

బీజింగ్‌ః ఢిల్లీలో ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగే జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ హాజరు కావడం లేదని అధికారికంగా తేలిపోయింది. ఈ విషయాన్ని చైనా ధ్రువీకరించింది. సదస్సుకు తమ ప్రధాని లీ కియాంగ్ హాజరవుతారని ప్రకటించింది. భారత్-చైనా మధ్య మూడేళ్లుగా సరిహద్దు విషయమై తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో భారత్ కు రాకూడదని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నిర్ణయించుకోవడం గమనార్హం. జిన్ పింగ్ రాకపోవడం తనకు నిరాశ కలిగించినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం తెలిసిందే.

‘‘భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు స్టేట్ కౌన్సిల్ ప్రధాని లీ కియాంగ్, ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరిగే 18వ జీ-20 సదస్సుకు హాజరుకానున్నారు’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ప్రకటన విడుదల చేశారు. నిజానికి తమ అధ్యక్షుడు జీ-20 సదస్సుకు రావడం లేదని చైనా ఈ నెల 2నే సమాచారం ఇచ్చింది. ఇందుకు సంబంధించి లిఖిత పూర్వక సమాచారం ఇవ్వలేదు. తమ అధ్యక్షుడు ఎందుకు రావడం లేదన్న దానిపై చైనా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.