అవినీతి చేయకుంటే సింగపూర్‌లో హోటల్స్ ఎలా వచ్చాయి?: కొడాలి నాని

దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని విమర్శ

kodali-nani-hot-comments-on-chandrababu

అమరవతిః గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… భారత దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని దుమ్మెత్తి పోశారు. చట్టాలు, వ్యవస్థలను అడ్డుపెట్టుకొని దోచుకునే వ్యక్తి అని ఆరోపించారు. ఎలాంటి అవినీతి చేయకుంటే సింగపూర్‌లో ఆయనకు హోటల్స్ ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో తాను 5వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని పార్టీ నేతలకు చెప్పారని, అవినీతి చేయకుంటే అంత డబ్బు ఎక్కడిదన్నారు.

చంద్రబాబులా తాము ఖర్చు చేస్తే 2014లోనే వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. దేశంలో అత్యంత అవినీతిపరుడు, అత్యంత నమ్మకద్రోహి, అత్యంత స్వార్థపరుడు, దొంగ, 420 చంద్రబాబు అని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. రూ.118 కోట్లు దోచుకున్న దొంగ అన్నారు. చంద్రబాబు రెండెకరాల నుండి అంతా ఏమైనా న్యాయంగా సంపాదించాడా? అని ప్రశ్నించారు. తానేదో నీతిపరుడిని అయినట్లుగా ప్రత్యర్థుల పైన బురదజల్లుతూ జైలుకు పంపించాలనుకునే వ్యక్తి అన్నారు.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి చంద్రబాబు అన్నారు. బిజెపిని వాడేసుకుంటాడు, కాంగ్రెస్ జెండా పట్టుకుంటాడన్నారు. చంద్రబాబులా వైఎస్ కుటుంబం ఏమైనా రెండెకరాల నుండి వచ్చిందా? అన్నారు. వైఎస్ కుటుంబం మొదటి నుండి సంపన్న కుటుంబమన్నారు. కానీ చంద్రబాబు మాత్రం 420 అన్నారు. 2019లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.