పరువుకు భంగం కలిగేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారుః కెటిఆర్‌

Will send legal notices to Congress leaders: KTR

హైదరాబాద్‌ః తెలంగాణ రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తోంది. ఈ అంశంలో ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా కెటిఆర్‌ స్పందిస్తూ… తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా పరువునష్టం దావా వేస్తానని చెప్పారు.

‘నా పరువుకు భంగం కలిగేలా ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రికి లీగల్ నోటీసులు పంపిస్తా. నిరాధారమైన, సిగ్గు పడాల్సిన అరోపణలు చేసినందుకు వారు నాకు క్షమాపణలు చెప్పాలి. లేదా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వాస్తవాలను తెలుసుకోకుండా వార్తలు రాస్తున్న న్యూస్ ఔట్ లెట్లకు కూడా లీగల్ నోటీసులు పంపిస్తా’ అని ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో మంత్రి కొండా సురేఖ పేరును నేరుగా ప్రస్తావించకుండా… ఒక మంత్రి అని కెటిఆర్‌ పేర్కొన్నారు. తన ట్వీట్ కు… ఆంగ్ల వార్తాపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని షేర్ చేశారు.